Tuesday, September 11, 2012

నిజాలను నీరుగార్చే యత్నం Andhrjyothi May 30th 2012 and Anvehsi Broad sheet

నిజాలను నీరుగార్చే యత్నం

- ఏశాల శ్రీనివాస్

కదిరె కృష్ణ రాసిన వ్యాసంఃనిజాం బహుజన పక్షపాతా?ః (ఆంధ్ర జ్యోతి మే 3, 2010) చదివిన తరువాత ఆయన తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. చరిత్రలో రాజులందరి గురించి వెలుగు మాత్రమే ప్రచారంలో ఉంది. ఒక్క నిజాం విషయంలో మాత్రం చీకటి మాత్రమే అందరికీ తెలుసు.

ఃఏ ఒక్క నిజామో కొంత మేలురకంగా పాలిస్తే అందరు నిజాముల పాలన అదే విధంగా సాగిందనుకోవడం పొరపాటుః అంటూ అఫ్జలుద్దౌలా (1857- 1869) ఐదవ నిజాం, మీర్ మహబూబ్ అలీఖాన్ (1869- 1911) ఆరవ నిజాం లది (ఇక్కడ ఒక్కరు ఇద్దరయిండ్రు) మెరుగైన పాలన అయిఉండవచ్చు అని పొంతన లేకుండా రాసిండు. ఃతెలంగాణలో ఊచకోతకు, దుశ్చర్యలకు కారకుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ః అని కదిరె కృష్ణ తన చారిత్రక అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు.

నిజానికి తెలంగాణలో ఊచకోతకు అప్పటి హోం మంత్రి వల్లభాయి పటేల్, ప్రధాని నెహ్రూ కారకులు. తెలంగాణ సాయుధ పోరాటంలో 400 మంది అమరులు కాగా పోలీస్ యాక్షన్ సందర్భంగా పటేల్ పటాలాల చేతిలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మందిఅమాయక ముస్లిం ఊచకోత తరువాతనే పటేల్ సైన్యం నిజాం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది.

రజాకార్ల దుశ్చర్యలకు భయపడి పారిపోయింది బహుజనులే అని కదిరె కృష్ణ సూత్రీకరించిండు. రాజాకార్లలో అధికభాగం దళితబహుజనులే. వీరిలో అనేక మంది భూస్వాములు దౌర్జన్యాలు భరించలేక ఇస్లాం స్వీకరించారు. రజాకార్ల అలజడి హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాలకే పరిమితం అయింది.

వరంగల్ జిల్లాకు చెందిన పీసరి వీరన్న అనే దళిత నాయకుడు ఃహరి జనులుః అనే పదాన్ని వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ 1940 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చిన గాంధీని వేదికపైనే నిలదీసిన ధీశాలి. ఈయన దళితుల అభ్యున్నతి కోసం ఒక సాయుధ దళాన్నిఏర్పాటు చేసి రక్షగా నిలిచాడు. ఈయన అల్లమ ప్రభువు పేరిట వరంగల్‌లో అల్లాకు గుడి కట్టించాడు.

వీటన్నింటిని కూలంకషంగా పరిశీలించినట్టయితే మత మార్పిడులు- రజాకార్ల విషయంలో మూలవాసీ రచయితల సంఘం తమ అభిప్రాయాల్ని పునఃసమీక్షించుకుని పునర్మూల్యాంకనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా అని నేను రజాకార్లను సమర్థించడం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే.

బి.ఎస్.వెంకట్రావ్ ఇంటి వద్ద జూలై 29న హైదరాబాద్ ఇండిపెండెన్స్ డేను జరుపుకున్నారని కదిరె కృష్ణ రాసిండు. కానీ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నది జూన్ 29న. ఆ రోజు బిఎస్ వెంకట్రావ్ ఇంటికి సమీపంలో డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ భారీ బహిరంగ సభ జరిగింది. దీనికి రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ కూడా హాజరయిండు.

నిమ్న కులాల ప్రజలు ఇంకా సవర్ణుల చేతిలో బాధలకు గురవుతూనే ఉన్నారు.. ఎలాంటి శషభిషలు లేకుండా స్వేచ్ఛగా మా యింటికి వచ్చి మాతో పాటు కూర్చొని మాకు మద్దతిచ్చే వారితో మేం చేతులు కలిపాంః అని దళితోద్యమ నాయకుడు శ్యామ్ సుందర్ అన్నాడు. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఃఆదిహిందూ మురళి నివారణ్ మండలిః దేవదాసీ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసింది.

ఈ సంస్థకు నిజాం ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందచేసింది. బహుశ దీనిని దృష్టిలో పెట్టుకుని జిలుకర శ్రీనివాస్ నిజాముని ఆదరించారని చెప్పి ఉండవచ్చు. భాగ్యరెడ్డి వర్మ ,అరిగె రామస్వామి ఇద్దరూ ఆర్యసమాజ్ ప్రభావితులని చెప్పడం కూడా తప్పు. భాగ్యరెడ్డి వర్మపై ఆర్యసమాజ్ కన్నా బ్రహ్మసమాజ్, బౌద్ధం ప్రభావం ఎక్కువగా ఉంది.

దళితులు కాంగ్రెస్, కమ్యూనిస్టు ,రజాకార్ల మద్దతు దార్లుగా ఉన్నారని కృష్ణ రాసిండు. హైదరాబాద్ రాజ్య దళితులందరూ రాజకీయ ప్రవేశం చేసింది డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ద్వారానే. దళితులు విదేశాలలో చదువుకోవడానికి వీలుగా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, 1947లో నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం కోటి రూపాయలు అప్పటి వరకు ఉన్నదానికి అదనంగా చేర్చినవిషయం గమనించాలి. బహుజనుడైన డాక్టర్ మల్లయ్యను జర్మనీలో పరిశోధనలు చేయడానికి పంపించిన విషయాన్ని , ఎం.ఎల్ ఆదయ్య హైకోర్టు కట్టించిన కాంట్రాక్టర్ అని , వల్తాటి శేషయ్య ఆనాటి ప్రభుత్వ కాంట్రాక్టర్లలో అగ్రగణ్యుడనే విషయాన్ని గ్రహిస్తే నిజాం పాలన గురించి ఒక అంచనాకు రావచ్చు.

బిఎస్ వెంకట్రావ్ పేరు బదులు పొరపాటున భాగ్యరెడ్డి వర్మను విద్యాశాఖ మంత్రిగా పేర్కొన్నారు. 1961లోనే అంటుదోషము మానరెలా? అంటూ హైదరాబాద్‌లో ఇక్కడి దళితోద్యమాలతో (ఆది హిందూ) అత్యంత సాన్నిహిత్యం గల కుసుమ ధర్మన్న రాసిన పుస్తకం చదివుంటే హైదరాబాద్‌లో దళితుల పరిస్థితి ఆంధ్ర ప్రాంతం కన్నా మెరుగ్గా ఉండేదని అర్థమయ్యేది. నిజాం విషయం వచ్చే సరికిఆటోమేటిక్‌గా మూసుకుపోయే కళ్ళు ఇప్పటికైనా తెరుచుకోవాలె. నిష్పాక్షికంగా అధ్యయనంచేస్తే విస్మయం కొలిపే విషయాలు బయటపడతాయి. మన చరిత్ర లోతుల్లోకి వెళ్ళి అన్ని పార్శ్వాల నుంచి అధ్యయనం చేయాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ పని బాధ్యతతో చేయాలి.
- ఏశాల శ్రీనివాస్

No comments:

Post a Comment

18 OCTOBER 2023 ADDAM DAILY EDITORIAL